AP Koushalam Portal IT Jobs యువతకు ఐటీ ఉద్యోగాలు.. కొత్త పోర్టల్ను తీసుకొచ్చారు, మంచి అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ‘కౌశలం’ అనే ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించి, ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవల రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇప్పటికే లక్షలాది యువత వివరాలు సేకరించిన ప్రభుత్వం, అర్హత ఆధారంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా అందించింది.
హైలైట్స్
- ఏపీలో ‘కౌశలం’ పోర్టల్ ద్వారా ఐటీ ఉద్యోగాలు
- ఏఐ ఆధారిత ఉద్యోగ గుర్తింపు విధానం
- 24.14 లక్షల మంది యువత వివరాల నమోదు
- ఇప్పటికే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
- వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలపై ప్రత్యేక దృష్టి
నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వ అండ
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు, యువతకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ‘కౌశలం’ పేరుతో సర్వే నిర్వహించి, నిరుద్యోగ యువత నుంచి సమాచారాన్ని సేకరించింది.
ఈ పోర్టల్లో చదువు పూర్తై ఉద్యోగం లేని వారు, తమ అర్హతకు తగిన ఉపాధి దొరకని యువత తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వారందరికీ అర్హత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
ఏఐ ఆధారిత ఉద్యోగ గుర్తింపు
‘కౌశలం’ పోర్టల్ ఏఐ ఆధారితంగా పనిచేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న యువతను డేటా ఆధారంగా గుర్తించే విధంగా ఈ వ్యవస్థ రూపొందించారు.
డేటా, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను పరిశీలించి అర్హత కలిగిన యువతను ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని తెలిపారు.
ఇప్పటికే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24.14 లక్షల మంది యువత వివరాలను పోర్టల్లో నమోదు చేశారు. వీరిలో నైపుణ్యం, అర్హత ఆధారంగా సుమారు 2.5 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించడం విశేషం.
దేశవ్యాప్తంగా రోడ్షోలు
యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ఐటీ కంపెనీలతో రోడ్షోలు నిర్వహించనుంది. ఈ రోడ్షోల ద్వారా మరిన్ని కంపెనీలను ఏపీ యువతతో అనుసంధానం చేయనున్నారు.
అన్ని కళాశాలల్లో కౌశలం పోర్టల్
ఈ ‘కౌశలం’ పోర్టల్ను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యార్థుల విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలను నేరుగా కంపెనీలకు చేరవేయాలన్నది లక్ష్యం.
ఈ ప్రాజెక్టును రాబోయే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు కూడా
కౌశలం పోర్టల్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పరీక్షలు నిర్వహిస్తూ, అర్హులైన యువతను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.